రాతలు – కోతలు

జూన్ 30, 2009

కోతికొమ్మచ్చి పుస్తకావిష్కరణ సభ విశేషాలు.

ప్రచురించిన వర్గము పుస్తక పరిచయము — కస్తూరి మురళీకృష్ణ @ 5:58 అపరాహ్నం

పెద్దన్నకు గండపెండేరం ఎలా తొడిగారో నేను చూడలేదు. శ్రీనాథ కవి సార్వభౌముడికి మహా మహా సన్మానాలెలా జరిగాయో నేను చూడలేదు. ఆకాలంలో మహా కవులకు జరిగే సత్కారాలగురించి చదివి, ఊహించుకుని ఈకాలం లో ఎవరికీ ఎలాంటి విలువలేకుండా పోయిందే అని బాధపడుతూండేవాడిని.

రవీంద్ర భారతి కళావేదికపై బాపు రమణలకు జరిగిన సన్మానం, పుస్తకావిష్కరణలు చూసినతరువాత  మనసు అవ్యక్తానందంతో నిండిపోయింది.

ఈకాలంలో, కళాకారులకింత గౌరవం దక్కటం చూడటం నా భాగ్యంగా భావిస్తున్నాను.

అంతకన్నా ఆనందం కలిగించిన విషయం, బయట ప్రజలు ఎగబడి పుస్తకాలు కొనటం. ఇలాంటి దృష్యం ఈ జన్మకు చూస్తాననుకోలేదు.

నాకు ఆనందంతో పాటూ కాస్త అసూయకూడ కలిగింది.

ఎందుకంటే, ఎగబడి పుస్తకాలు కొంటున్నవారంతా నడివయసు, ఆపైన వారే. అంటే, ఇక భవిష్యత్తులో, ఇలా కొనేవారూ, చదివి మెచ్చేవారూ అరుదయిపోతారన్నమాట. కాబట్టి ఇలాంటి అపూర్వమయిన, బహుషా, మళ్ళీ చూడలేని సంఘటనకు నేను సాక్షినయ్యానన్నమాట.

అయితే, ఈసభ మరో విషయాన్ని నేర్పింది.

సభకుముందు కొందరు కళాకారులు బాపు రమణల సినిమా పాటలు పాడారు. దాన్లో మగ గాయకుడు వినోద్ బాల సుబ్రహ్మణ్యంలా పాడీ పాడీ ఏపాట పాడినా అలాగే పాడటం అలవాటయిపోయింది. గొంతు బాగుంది. కానీ, పాటలోని పదాలలో జీవంలేదు.

గాయిని సురేఖ కూడా కళ్ళు పాట తప్ప మిగతా పాటలన్నీ, తేలికగా పాడేసింది.

అయితే, మేము ఎదురుచూసిన పాట నిదురించేతోటలోకి పాడిన అమ్మాయి పాట వింటే శేషేంద్రనేకాదు, మహదేవన్ కూడా మళ్ళీ జన్మలో పాటల జోలికిపోరు. అంత అద్భుతమయిన పాటను ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఇంత ఘోరంగా భావ రహితంగా పాడవచ్చని నిరూపించిందా అమ్మాయి. అయితే, పాట మొదట్లోనే, కణ్ణుల్లో నీరు తుడిచి అనగానే నా కళ్ళు వొళ్ళు సర్వం జలదరించి జలదరించి( ఎవరయినా దీన్ని బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్ అంటే అనుకోవచ్చు. నాకేమీ బాధ, కష్టము, నష్టమూ లేవు)ఇంకా జలదరిస్తూనేవుంది. ఇలాంటి కార్యక్రమంలో ఏవో పాడాలి కాబట్టి పాడేరు తప్ప హృదయంతో పాడలేదు. కేబీకే మోహన్ రాజ్, గొంతుపోయినా, ఎవరికివారే ఈలోకం పాటను ఎంతో ఫీలింగ్ తో, అద్భుతంగా పాడాడు. అది చాలు ఆతరానికి, ఈతరానికి వున్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తుంది. ఇప్పటివారికి శరీరం చాలు. దానికే అలంకరణలు చేసి గొప్పవారయిపోతారు. అప్పటివారికి శరీరం కన్నా ఆత్మపైనే దృష్టి. అందుకే అంత ఆత్మానందం కలిగిస్తుంది వారికళ. ఈసభలో రావికొండలరావు, అక్షింతలు అధ్బుతం. మళ్ళీ ఇలాంటి సభ, ఇలాంటి కళాకారులు, ఇలాంటి సన్మానం ఈజీవితకాలంలో చూడలేననే అనుకుంటున్నాను.

సభ విశేషాలు బొమ్మల్లో చూడండి.

  Image020Image024Image025

 

 

 

Image023Image022

 

Image028Image027

Image029

 

Image030

జూన్ 29, 2009

ఈవారం నేను బిజీ, బిజీ!

ప్రచురించిన వర్గము నా రచనలు. — కస్తూరి మురళీకృష్ణ @ 4:11 అపరాహ్నం

ఈవారం నేను  కాస్త బిజీ, బిజీ!

రాతల పనులున్నాయి. కోతల పనులు బోలెడున్నాయి. అందుకనే, ఈవారం బ్లాగువైపుకు నేను ఎంతమటుకు వస్తానో చెప్పలేను. కాబట్టి నా బ్లాగులో కొత్త పోస్టులు లేకపోతే ఏమీ అనుకోకండి. క్రితం రెండువారాలు పుస్తకావిష్కరణ పనులవల్ల రాత పనులు దెబ్బ తిన్నాయి. అందుకని ఈవారం రాత పనులపైనే దృష్టి కేంద్రీకరించాల్సివస్తోంది.  అయితే, వూళ్ళోనే వుంటాను కాబట్టి, వీలు దొరకగానే రాసేప్రయత్నాలు చేస్తాను కాబట్టి బ్లాగుకు సెలవలు ప్రకటించటంలేదు.

ఇప్పతికే బ్రహ్మబుధ్ కు నాపైన కోపం వచ్చింది. వాడి అరుంధతి కథను నేను పూర్తిగా చెప్పనీయటంలేదని అలిగాడు. మన బ్లాగర్లు బ్లాగు అగ్రిగేటర్లమీద అలిగితే ఎలావుంటుందో వాడు నామీద అలిగితే అలావుంటుంది. అదే చెప్పా. చెరువుమీద అలిగినవాడి కథ చెప్పా. తీరిక దొరకగానే ముందుగా బ్రహ్మబుధ్ అరుంధతి కథ పూర్తిచేస్తానని వాడికి వాగ్డానం చేశా. బ్లాగుమీద అలిగి తెగతెంపులు చేసుకుని, తప్పు గ్రహించి మళ్ళీ వెనక్కు వచ్చిన బ్లాగర్లలా నాకు తీరిక దొరకటంకోసం ఎదురుచూస్తున్నాడు బ్రహ్మబుధ్.

సెలవు. త్వరలో కలుద్దాం.

జూన్ 28, 2009

ఈవారం నా రచనలు-17

ప్రచురించిన వర్గము నా రచనలు. — కస్తూరి మురళీకృష్ణ @ 1:11 పూర్వాహ్నం

నిన్న సభలో వల్లీశ్వర్ గారు, తీవ్రవాదం పుస్తకం గురించి మాట్లాడుతూ, పుస్తకంలో ఆయనకు నిష్పాక్షికత నచ్చిందన్నారు. నా ఫ్రెండొకాయన తాను రెగ్యులర్ గా రివ్యూలు రాసే పత్రికకు తీవ్రవాదం పుస్తక సమీక్షను రాసి తీసుకువెళ్ళాడట. ఆపత్రిక ఎడిటర్ పుస్తకంపై నా పేరును చూడగానే వీడు ఆరెస్సెస్ వాడు. వీడు తీవ్రవాదం గురించి రాస్తే ముస్లీం లను తిట్టటం తప్ప ఏమీ వుండదు, అని పుస్తకాన్ని నా ఫ్రెండు ముఖం మీదకు, సమీక్షను చెత్తబుట్టలోకీ విసిరేశాడట. ఇలా వుంటాయి మన రంగుటద్దాల ఆలోచనలూ, అపోహలూ.

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన కెనేడియన్ న్యూ ఏజ్ మ్యూసిక్ గాయని మార్కోమె బ్లాగ్ పరిచయం వుంటుంది.

ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ఎప్పటి లాగే సగటు మనిషి స్వగతం వుంటుంది. ఈసారి సగటు మనిషికి పెద్ద సందేహమే వస్తుంది. మందార మకరంద మాధుర్యం తెలియనివారి సంగతి ఏమిటన్నదాయన సందేహం.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికలో రాజకీయ విశ్లేషణ వుంటుంది.

గురువారం ఆంధ్రప్రభలోని చిత్రప్రభ అనుబంధంలో పథేర్ పాంచాలి నవలను సినిమాగా మలచటం గురించి చర్చ జరుగుతుంది.

కౌముది మాస పత్రికలో కథాసాగర మథనం వుంటుంది. మే నెలలో విడుదలయిన పత్రికలలోని 95 కథలలోంచి భిన్నంగా వున్న కహల పరిచయం జరుగుతుంది.

ఈభూమి మాస పత్రికలో మహమ్మద్ రఫీ పరిచయం పాడుతా తీయగా శీర్షికన వుంటుంది. నా జీవితంలో ప్రతి క్షణం నా వెంట వుండి తన పాటలతో నన్ను నడిపిస్తున్నాడు రఫీ. అందుకే వ్యాసం తూ ఇస్ తర్హా  సె మెరీ జిందగీమె షామిల్ హై, అన్నపాట తో ఆరంభమవుతుంది.

ఈనెల ఆంధ్రభూమి మాస పత్రికలో శ్రీశ్రీ పైన నేను రాసిన ప్రత్యేక విశ్లేషణాత్మకమయిన వ్యాసం వుంటుంది.

ఒకవైపు సాహిర్, మజ్రూహ్, షకీల్ ల పైన నావి మూడు పుస్తకాలు సిద్ధమవుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ కథలు దాదాపుగా సిద్ధం.

ఇవీ ఈవారం నా రచనలు. చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలపండి.

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.