రాతలు – కోతలు

మే 31, 2009

ఈవారం నా రచనలు-13

ప్రచురించిన వర్గము నా రచనలు. — కస్తూరి మురళీకృష్ణ @ 1:14 పూర్వాహ్నం

సమయం గడచిపోతోంది. కాలం గిర్రు గిర్రున తిరుగుతోంది. పనులు చేస్తూనే వున్నా చేయాల్సిన పనులు బోలెడన్ని మిగిలిపోతున్నాయి. అయినా, అర్ధరాత్రిళ్ళు ఆకాశం వైపు చూస్తూంటే, ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ప్రపంచమెంత అందమయినది కదా అనిపిస్తుంది. కొత్త ఉత్సాహంతో మరిన్ని పనులు చేయటానికి ఉపక్రమిస్తాను.

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో హర్ భజన్ సింగ్ బ్లాగు పరిచయం వుంటుంది బ్లాగ్ స్పాట్ శీర్షికలో.

ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటు మనిషి స్వగతం శీర్షికన ఈవారం ఆలోచన పుస్తకాల గురించి. ఈమధ్య కొందరు అచ్చు పుస్తకాల పనయిపోయిందని, ఇక పైన ఈబుక్స్ దే ప్రాధాన్యమనీ అంటున్నారు. అచ్చు పుస్తకాలు అదృష్యమయిపోతాయన్న భావన సగటు మనిషి మనస్సులో కలిగించిన సంచలనాలాలోచనలను ప్రతిబింబిస్తుంది సగటు మనిషి స్వగతం.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికలో ఈవారం ఎన్నికల ఫలితాల విశ్లేషణ వుంటుంది.

ఆంధ్రప్రభ గురువారం అనుబంధం చిత్రప్రభలో బాల సినిమాల స్క్రిప్టు రచన వొశ్లేషణ కొనసాగుతుంది.

ఈనెల విడుదలయ్యే ఈభూమిలో పాడుతా తీయగా శీర్షికన ప్రఖ్యాత గాయకుడు, తగిన గుర్తింపు పొందని మహా గాయకుడయిన మన్నాడే పరిచయం వుంటుంది. నిజానికి ఇప్పుడు మన్నాడేని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. మన్నాడే పాడే పద్ధతిని వివరిస్తూ, అతనెందుకు అంతగా విజయం సాధించలేకపోయాడో వివరించానీ వ్యాసంలో.

కౌముడు పత్రికలోని కథాసాగర మథనం శీర్షిక గురించి నాకు మంచి స్పందన లభిస్తోంది. ఏప్రిల్ నెల లోని 90 పైగా కథలను చదివి వాటిలోంచి బాగున్న కొన్ని కథలను, ఒక ఈనెల కథనూ ఎన్నుకున్నాను. ఈ శీర్షిక కథారచయితలకే కాక, కొత్త కథల విశ్లేషణ కావటంతో విమర్శకులకూ, సంకలన కర్తలకూ ఉపయోగకరంగా వుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తీవ్రవాదం పుస్తకం, అచ్చయి, బైండయి, ముస్తాబయి వచ్చేసింది. ఇక పాథకుల కోసం ఎదురుచూస్తోంది. తెలుగులో రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు తక్కువే. ఇందియా టుడే తెలుగులో వస్తున్నాప్పుడు, తెలుగులో రాజకీయ పత్రిక నిలబడలేదని కూదా పలువురు అభిప్రాయపడారు. అయినా, తెలివయినవారు వెళ్ళేందుకు జంకే బాటలో మూర్ఖుడు పరుగిడతాడన్నట్టు, నా వంతు ప్రయత్నంగా పుస్తకాన్ని వెలువరించాను.

ఇవీ, ఈవారం నా రచనలు. చదివి, మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్త పరుస్తారని ఆసిస్తున్నాను.

మే 29, 2009

పుస్తకాలు- సమీక్షలూ!

ప్రచురించిన వర్గము నా రచనలు. — కస్తూరి మురళీకృష్ణ @ 3:46 అపరాహ్నం

ఒక పుస్తకం ప్రచురితమయిందని పాఠకులకు తెలిసేందుకు పత్రికలలో సమీక్షలే ప్రాధాన సాధనమని తెలుసుకున్నాం.

పత్రికలలో సమీక్షలలో వున్న మతలబులగురించి చర్చించేబదులు, సమీక్షల ప్రభావం గురించి చర్చిద్దాం.

పుస్తకాల సమీక్షలు చూసి పుస్తకాలెంతమంది కొంటారన్న విషయాన్ని పక్కనపెట్టి  పుస్తకాలకు ఆర్డర్లు ఎన్ని వస్తాయో అనేదానికన్నా, కొన్ని ఫ్రీగా తమ లైబ్రరీలకు పుస్తకాలు పంపమన్న ఉత్తరాలు మాత్రం ఠంచనుగా వస్తాయి. ఒకోసారి మన పుస్తక సమీక్ష పడిందని మనకు ఇలా వచ్చే ఫ్రీ పుస్తకాల వుత్తరాలవల్లనే తెలుస్తాయి.

సర్దార్ పటేల్ రోడ్డులోని ఆర్య వైష్య మహిళా సంఘం నుండి తప్పకుండా వుత్తరం వస్తుంది. వీరికి కవర్ పైన అడ్రసు రాసే తీర్క కూడా వుండదు. పేపర్లోని అడ్రసును కత్తిరించి కవరు అట్టపైన అతికించి పంపుతారు. ఆ అడ్రసు కాగితం చూసి ఏపత్రికలో రివ్యూ అచ్చయిందో తెలుసుకునే వీలుంటుంది. ఇది తప్ప వీరి వల్ల మనకు ఇంకో లాభం లేదు.

వీరినుంచి ఇలా వుత్తరాలొస్తూంటే ఒకసారి నేనో ఉత్తరం రాశాను. నేను వచ్చి మీ లైబ్రరీ చూస్తాను. ఒకరోజు అపాయింట్ మెంట్ ఇవ్వండి. లైబ్రరీబాగుంటే వేరే పుస్తకాలూ ఇస్తాను, అని రాశాను. సమాధానం రాలేదుకానీ, రివ్యూలు ఆచయినప్పుడల్లా వుత్తరాలు వస్తూనే వున్నాయి.

ఇంకా అనంతపూర్ నుంచి ఓ లైబ్రరీకి ఉచితంగా పుస్తకాలు పంపమని వుత్తరం వస్తుంది. మనమే డబ్బులు పెట్టి అచ్చువేసుకోవటమేకాదు, కొరియర్ డబ్బులు పెట్టుకునిమరీ ఉచితంగా పుస్తకాన్ని పంపుకోవాలన్నమాట.

ఇంకా మహబూబ్ నగర్ నుంచి ఓ ముస్లీం పేరుతో కార్డు వస్తుంది. సన్మానం చేస్తామని, అయిదు కాపీలు పంపమని.

కర్నూల్ నుంచి వచ్చేవుత్తరంలో, తాను చాలా పేదవాడిననీ, మీ పుస్తకం చదవాలని వుంది, కాబట్టి పంపండీ అన్న ఆర్డరుంటుందా వుత్తరంలో.

ఇలాంటి వుత్తరాలు మాత్రం తప్పనిసరిగా వస్తాయి.

వీటి మధ్య డబ్బులు పంపేవారూ వున్నారు. ఒకో రివ్యూకీ కనీసం అయిదునుంచి పది ఆర్డర్లు వస్తాయి. తరువాత కూడా ఆ పత్రికలో రివ్యూ చూశాము, కాపీ పంపండి అంటూ డబ్బులు పంపుతారు. అన్ని పత్రికలలో వెంట వెంటనే రివ్యూలు వచ్చేకన్నా, కాస్త విరామముండి వస్తూంటే బోలెడన్ని ఆర్డర్లు వచ్చిన భావన కలుగుతంది.

అయితే, రివ్యూలయిపోయిన తరువాత మాత్రం పుస్తకాలు అమ్ముడు పోవాలంటే ఆ పుస్తకం గురించి పత్రికలలో చర్చలు జరగాలి. లేదా దాని గురించి పదిమంది మంచి మాటలు ఏదో ఒక సభలో చెప్తూండాలి. లేకపోతే పుస్తకం నెమ్మదిగా మరుగున పడుతుంది.

అందుకే, కొందరు రచయితలు తమ పేరు ముందు తమ పుస్తకం పేరును ఇంటి పేరుగా పెట్టుకుని, ఆ పుస్తకాన్ని సజీవంగా వుంచే ప్రయత్నాలు చేస్తారు. అయితే, వారు  విస్మరించినదేమిటంటే, తమ పేరు చెప్పగానే ఒకే రచన గుర్తుకువస్తోంది, అదీ తొలి రచననే అంటే వారి ఎదుగుదల అంతటితో ఆగిపోయిందని అర్ధం. ఆతరువాత వారు చెప్పుకోదగ్గ గుర్తుంచుకోదగ్గ రచన చేయలేదని అర్ధం.

మనం కృష్ణ శాస్త్రిని ఊర్వశి కృష్ణ శాస్త్రి అనో, పల్లకి కృష్ణ శాస్త్రి అనో అనము. అలాగే, యండమూరిని తులసీదళం యండమూరి అనీ, విజయానికి అయిదుమెట్ల యండమూరి అనీ అనం. చలాన్ని మైదానం చలమనో, స్త్రీ చలమనో అనం. అలా అన్నామంటే ఎదుగుదల ఆ రచనతో ఆగిఓయిందని అర్ధం.

కానీ, ఇలా ఒక రచనను ఇంటి పేరు చేసుకోవటం వల్ల ఆ పుస్తకం పేరు రచయిత పేరు చూసినప్పుడల్లా గుర్తుకువస్తుంది. పేరు బాగా నలుగుతుంది. ఆరకంగానైనా ఆ పుస్తకం చిరకాలం సజీవంగా వుంటుంది. అయితే, ఇదికూడా అందరికీ సాధ్యం కాదు. కాబట్టి పుస్తకాన్ని ప్రచురించి దైవం పైన భారం వేయటం తప్ప మరేమీ చేయలేము. రచయితగా రచన చేయటమే కాక, దాన్ని ప్రచురించి మరీ సమాజానికి అందించిన తరువాత దాన్ని స్వీకరించటమో, తిరస్కరించటమో, సజీవంగా నిలుపుకోవటమో అది సమాజం బాధ్యత. విమర్శకులు, సమీక్షకుల బాధ్యత. ఆ బాహ్యత నుంచి తెలుగు సాహితీకారులెలా తప్పించుకుంటున్నారో, సమీక్షల, విమర్శల మతలబులు చూస్తే అర్ధమవుతుంది.

ఇది మరోసారి.

ఒబామా- పుస్తక పరిచయం!

ప్రచురించిన వర్గము పుస్తక పరిచయము — కస్తూరి మురళీకృష్ణ @ 3:37 పూర్వాహ్నం
Tags: , , , ,

తెలుగులో సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితులకు సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువ. ఇది సాహిత్యానికేకాదు, సినిమాలకూ ఇతర కళలకూ వర్తిస్తుంది.

ఏదయినా సంఘటన జరగగానే ఆ సంఘటనకు సంబంధించిన పూర్వపరాలను వివరిస్తూ విశ్లేషిస్తూ వచ్చే పుస్తకాలు చాలా అరుదు. అందుకే, గుడిపాటి రచించిన ఒబామా- స్ఫూర్తిదాయక విజయగాథ, ఆనందం కలిగిస్తుంది.

నిజానికి, మన ప్రచురణకర్తలకూ, రచయితలకూ పాఠకులపైన నమ్మకమూ, గౌరవమూ తక్కువే. పాఠకులు ఇవే చదువుతారని నిర్ణయించి అలాంటివే ఇస్తూ పాఠకుల చదివే అలవాట్లపైన పరిమితులు విధించారు. వారి పఠనాసక్తులను చట్రంలో బిగించారు.

ఇందుకు నిదర్శనాలనేకం. మన తెలుగులో విశ్లేషణాత్మకమయిన రచనలు తక్కువ. జీవిత చరిత్రలు తక్కువ. సమకాలీన రాజకీయ పరిస్థితులను వివరించే పుస్తకాలు ( జెనెరల్ నాలెడ్జ్ వదిలేస్తే) లేవు. దేశాన్నేకాదు, ప్రపంచాన్ని కుదిపేస్తున్న తీవ్రవాదం పైన తెలుగులో వచ్చిన పుస్తకం నాదే. మన ప్రధానమంతృలు, ముఖ్యమంతృలందరి గురించి వున్న ఏకైక పుస్తకం నేను రచించిందే. అంటేనే అర్ధం చేసుకోవచ్చు మన తెలుగులో పాఠకుల పఠనాసక్తిపైన ఎన్ని పరిమితులున్నాయో.

అందుకే, ఒబామా రాజకీయ విజయ గాథను గుడిపాటి రాసి, ప్రచురించటం ఒక రకంగా సాహస గాథ అనవచ్చు.

అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఎన్నికవటం ఒక చారిత్రాత్మక సంఘటన. అణచివేతకుగురయిన నల్లవారు అమెరికాలో తమ శక్తిని గుర్తిస్తున్నారనటానికి నిదర్శనం. ప్రపంచంలో పలురకాలుగా అణచివేతకు గురవుతున్న వారందరికీ ఆశాకిరణం.

అందుకే ఒబామా, జీవితం, అతని ఎదుగుదా, అతని మానసిక స్థితి, వ్యక్తిత్వం, ఆయన ఎల్లా రాజకీయాలలోకి వచ్చారు, ఏయే అమ్షాలు ఆయనను విజేతను చేశాయి అన్న విషయాలను వివరించి విశ్లేషించి పాఠకులకు అందించటం అత్యంత ఆవశ్యకమయినది. ఇంతవ్రకూ అలాంటి పుస్తకం తెలుగులో లేదు. గుడిపాటి రచించిన ఈ పుస్తకం ఆలోటును తీరుస్తుంది.

ఒబామా విజయ గాథను 23 అధ్యాయాలలో వివరిస్తుందీ పుస్తకం. మొదటి అధ్యాయం ముందుమాట లాంటిది. పుస్తకరచనకు ప్రేరణను వివరిస్తుంది.

రెండవ అధ్యాయ్సంలో పూర్వరంగం వుంటుంది. దీన్లో అమెరికాలో నల్లవారి స్థితిగతుల పరిచయం జరుగుతుంది.

మూడవ అధ్యాయంలో ఒప్బామా తల్లి తండ్రి వారి నేపధ్యాలు తెలుస్తాయి.

నాలుగవ అధ్యాయం నుంచి, ఎనిమిదవ అధ్యాయం వరకు, ఒబామా బాల్యం, అతనిపై ప్రభావాలు, చదువు, మిషెల్ తో పరిచయం , వివాహం వంటి సంఘటనలు, ఒబామా వ్యక్తిత్వ ఎదుగుదలను చూపుతూ సాగుతాయి.

తొమ్మిదవ అధ్యాయం నుంచి, 13వ అధ్యాయం వరకూ ఒబామా రాజకీయాల ప్రవేశం, సెనేటర్ గా ఓటమి, ఎన్నికవంటి విషయాలు వుంటాయి.

15వ అధ్యాయం ఒబామా రచనలను వివరిస్తుంది.

16లో అధ్యక్షపదవి పోటీ, 17లో గెలుపు ప్రాధాన్యం వుంటాయి.  అయితే, అధ్యక్షపదవిపోటీ మరింత వివరంగా వుండాల్సింది. ఎందుకంటే, ఎలాంటి రిజెర్వేషన్లూ లేకుండా, తెల్లవారిని వారి ప్రామాణికాలతోనే తన పార్టీలోనూ, ప్రత్యర్ధిపార్టీలోనూ ఓడించి, నల్లవారికి ఎలాంటి క్రచ్చులూ, ప్రత్యేకతలూ అవసరంలేదనీ, నలుపూ, తెలుపూ అన్నవి శరీరానికేతప్ప మనసుకుకావనీ ఒబామా నిరూపించటం ఎంత ప్రాధాన్యం వహించే విషయం. అయితే, పుస్తకమంతా రచయిత రిపోర్టింగ్ పద్ధతిలో రచించటంవల్ల ఈ అధ్యాయంకూడా అలాగే సాగింది.

చివరి అధ్యాయాలు ఒబామా ఆరోగ్యపుటలవాట్లు, ఆయన మెచ్చిన పుస్తకాల వివరాలు, ఒబామా గెలుపును ఎలా అర్ధం చేసుకోవాలి అన్న విశ్లేషణలుంటాయి. 22వ అధ్యాయంలో ఒబామా జీవన క్రమం, 23లో ఉపయుక్త గ్రంథావళి వున్నాయి.

ఇంగ్లీషు పుస్తకాలు చదివేవారు, ఒబామా గురించి తెలుగు పుస్తకాన్ని చులకనగా చూడవచ్చు. కానీ, తెలుగులో పుస్తకాల ప్రచురణలో సాధక బాధకాలు తెలుసుకుంటున్న మనం ఇలాంటి ప్రయోగాలకు ప్రోత్సాహాన్నివ్వాలి. ఇలాంటి పుస్తకాలను ఆదరించాలి.

ఇలాంటి పుస్తకాలకు ఆదరణ వున్నదని నిరూపిస్తే, తెలుగు రచయితలు, ప్రచురణకర్తలు కూడా మరింత రీసెర్చ్ జరిపించి, మరింతగా ఇలాంటి పుస్తకాల ప్రచురణపై దృష్టి పెడతారు. అదీగాక, విద్యావంతులకు, పట్టణాలలో వున్నవారికీ ఆంగ్ల పుస్తకాలు దొరకటం కష్టం కాదు. కానీ, రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తెలుగు పుస్తకాలు లభ్యమవటమే గగనం. అలాంటి వారికి ఒబామా గురించి సమగ్రమయిన సమాచారాన్నందించి, ఒక అభిప్రాయాన్ని ఏర్పరచటంలో ఈ పుస్తకం దోహదపడుతుంది. కాబట్టి, ఈ పుస్తకాన్ని తాము కొనటమేకాక పదిమందికీ చెప్పి కొనిపించాలి. అప్పుడే వైవిధ్యభరితమయిన పుస్తకాలింకా వచ్చేవీలుంటుంది. ఈపుస్తకం వెల కూడా తక్కువే. కేవలం 50 రూపాయలే.

ఒబామా
స్ఫూర్తిదాయక విజయ గాథ.
రచన- గుడిపాటి.
ప్రతులకు- పాలపిట్ట
16-11-20/6/1/1
సలీం నగర్, మలక్ పేట్
హైదెరాబాద్-36.
ఈ మెయిలు- palapittabooks@gmail.com
వెల- 50 రూపాయలు.
పేజీలు-152.

తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.