సాంప్రదాయిక జెంటిల్మాన్ క్రికెట్టు దబ్బు వేటలో పడి కార్పొరేటు క్రికెట్టుగా మారింది.దబ్బు ఆశలో క్రికెట్టు బోర్డులు,ఆటగాళ్ళు,వ్యాపార సంస్థలూ అందరూ క్రికెట్టుకు ఎగబడ్డారు.ఆట స్వరూపాన్ని ఆధునిక సామాజిక మనస్తత్వానికి తగ్గట్టుగా మార్చేసారు.ఆధునిక కార్పొరేట్ క్రికెట్టు అసహ్య రూపం ఇప్పుడిప్పుడే బయట పడుతోంది.
వ్యాపార సంస్థలు క్రికెట్లో వ్యాపారం కోసం అడుగు పెట్టాయి.వాటికి లాభాల భాష తప్ప మరొకటి అర్ధం కాదు.అర్ధం కావాలని అనుకోవటం పొరపాటు.పెట్టుబడికి తగ్గ లాభాలు రాక పోతే వారు తమ నిర్ణయాలను పునస్సమీక్షించుకుంటారు.లాభాలు వచ్చే నిర్ణయాలు తీసుకుంటారు.క్రికెట్ లో అదే జరుగుతోంది.
ఐ.పి.ఎల్ పోటీలలో కార్పొరేట్ సంస్థలు ఆటగాళ్ళని కొనుక్కున్నాయి. గుర్రప్పందేలాడేవాళ్ళు మంచి జాతి శ్రేష్టమయిన గుర్రాలను కొనుక్కుంటారు.వాటికి శిక్షణనిస్తారు.ఆ పై రంగంలో దింపుతారు.ఇక్కడా అదే జరిగింది.అయితే ఇక్కడ శ్రేష్ఠమయిన గుర్రాలుగా నిరూపణ అయిన ఆటగాళ్ళను వేలం లో కొన్నరు.రంగంలో దింపి తడాఖా నిరూపించుకోమన్నారు.గుర్రాలకూ మనుషులకూ తేడాలుంటాయని మరచిపోయారు.
ఆటలో ఆటగాడికి ఎంత ప్రతిభ వున్నా అతడి ఆట తీరును అదృష్టం నిర్ణయిస్తుంది.ఒకసారి బాగా ఆడేడు కాబట్టి ప్రతీసారీ బాగా ఆడాలని అనుకుంటే పొరపాటు.కొందరికి కొన్ని సందర్భాలలో ఎలా ఆడినా అచ్చి వస్తుంది.కొందరికి ఏమి చేసినా అచ్చిరాదు.గమనిస్తే,ఈ పోటీలలో గొప్ప గొప్ప ఆటగళ్ళు కూడా బోల్తా పడ్డారు.గిల్క్రిస్ట్,ఆఫ్రిది,గిబ్స్ లక్ష్మణ్ వంటి మేటి ఆటగాళ్ళున్నా డక్కన్ చార్జెర్లు చార్జి లేనట్టే వున్నారు.లక్ష్మణ్ అంటే వేగంగా పరుగులు తీయలేడు.మరి మిగతా వారికి ఏమయింది?గిబ్స్,ఆఫ్రిది లయితే ఎటువంటి చమత్కారాలూ చూపలేక పోయారు.ఫ్లెమింగ్,స్టయ్రిస్,యువరాజ్,పాంటింగ్, జయసూర్య,కైఫ్ లాంటి వారు వారు పలికిన ధరకు ఏమాత్రం న్యాయం చేయలేక పోతున్నారు.ఒక రకంగా చూస్తే,ఢిల్లీ జట్టు గెలుపు అధికంగా గంభీర్ పయిన ఆధారపడి వుంటోంది.చెన్నై జట్టు ధోనీ పయిన,ఇలా ఎవరో ఒకరి పయిన ఆధరపడి వుంటున్నాయి.బెంగళూరు జట్టు ఇందుకు భిన్నం కాదు.
బెంగళూరు జట్టు మిగతా వారికి ఏమాత్రం తీసిపోదు.కాలిస్,చందెర్పాల్,మిస్బాహ్,లాంటి వారు మంచి ఆటగాళ్ళు.కానీ అందరూ కలసి ఒక జట్టులా ఆడలేక పోతున్నారు.గమనిస్తే,రాహుల్ ద్రావిడ్ స్వతహాగా మంచి ఆటగాడయినా ఏకె-47 తుపాకుల కాలంలో విల్లమ్ములతో యుద్ధానికి దిగేవాడు ద్రావిడ్.ఇది అతనిపయిన పెట్టుబడి పెట్టేటప్పుడే అందరికీ తెలుసు.రాహుల్ అదృష్టం ఎలాంటిదంటే,అతడు బెట్ కడితే గెలిచే గుర్రం కూదా కుంటుతూ ఓడిపోతుంది.అతను,సెహ్వాగ్ కోసం అందరినీ ఎదిరించినంత కాలం సెహ్వాగ్ పరుగులు చేయలేదు.రైనా,కైఫ్ లాంటి వాళ్ళకోసం పోరాడినంత కాలం వాళ్ళు సరిగ్గ ఆడలేదు.ఇది తెలిసి కూడా రాహుల్ ను ఐకాన్ ఆటగాడిని చేసి అతను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని అనటంలో అర్ధం లేదు.నిజానికి,రాహుల్ ఆట తీరు 20-20 కి పనికిరాదు.శృతి చూసుకోందే రాగం పలుకలేని వాయిద్యం అతడు.శృతి గతి లేకుండా పంచమంలో ఆరంభించి ఇంకా పైకి పోవాల్సిన ఆట 20-20.మర్యాదగా అతడు పోటీల్లో పాల్గొనక పోతే పరువుదక్కేది.కానీ డబాశ ఏంచేస్తాం!
అయితే,కార్పొరేట్ సంస్థలు పెట్టుబడి పెట్టేముందు బోలెడంత రీసెర్చ్ చేస్తాయని విన్నాం.మాల్యా ఈ విషయంలో పూర్తిగా రాహుల్ పయిన ఆధారపడ్డడనటం నమ్మశక్యం కాదు.తాను కోరిన ఆటగాళ్ళు వేరే అని ఆయన అనటం ఈ విశయాన్ని స్పష్టం చేస్తుంది.అయితే,డబ్బు పెడుతున్న మాల్యా తన మాట నెగ్గించుకోలేక పోవటం అతని వ్యక్తిత్వాన్నే ప్రశ్నార్ధకంలో పడేస్తుంది.ఇదే ఆయన ముందే అనివుంటే బాగుండేది.ఇప్పుడు జట్టు దెబ్బ తింటున్నప్పుడు దోశం వేరే వారిపయిన నెట్టేయటం మాల్యా మేనేజీరియల్ శక్తిని సంశయంలో పడేస్తుంది.
అనుకున్న ప్రతిదాన్లో విజయ సాధించటం కుదరదు.ఓడిపోతున్నప్పుడు నేరాన్ని వేరే వారి పయిన నెట్టేయటం అధికారి సంకుచిత మనస్తత్వాన్ని సూచిస్తుంది.అసలే ఓడి దెబ్బతింటూన్న వారిని మరింత కృంగదీస్తుంది ఇలాంటి ప్రవర్తన.అయితే పెట్టిన పెట్టుబడికి లాభాలు రావాలన్న ఆష వున్న వారికి ఇవన్నీ కనబడవు.ఇలాంటి వ్యాఖ్యలు ఆటగాళ్ళ మనస్తత్వాలను దెబ్బతీస్తాయని,వారి విశ్వాసాన్ని తగ్గిస్తాయని ఆలోచన రాదు.ఇలా బహిరంగంగా నిరసన తెలిపే బదులు రహస్యంగా,ఆటగాళ్ళతో ఆంతరంగికంగా తన నిరసన వ్యక్త పరిస్తే అందరి పరువు దక్కేది. మాల్యా ఈ ప్రవర్తన కాలిస్,చందెర్పాల్,ద్రావిడ్ లాంటి ఆటగాళ్ళకు ఎంతో అవమాన కరం.అయితే డబ్బుకోసం సైతానుకు ఆత్మను తాకట్టు పెట్టిన తరువాత ఇవన్నీ భరించక తప్పదు. 
కార్పొరేట్ క్రికెట్ వికృత రూపం ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది.ఇక్కడ నైపుణ్యం తో పనిలేదు.వ్యక్తుల గౌరవంతో పనిలేదు.కావలసింది ఫలితం.రావలసింది డబ్బు.గుర్రంపై పెట్టిన పెట్టుబడికి ఫలితం రావాలి.లేకపోతే గుర్రాన్ని తరిమెయ్యి.కొత్త గుర్రం తెచ్చుకో.తమని తాము గుర్రాల స్థాయికి దిగజార్చుకున్న దోషం మాత్రం క్రీడా కారులదే.ఇకపై క్రికెట్ ఆట గాళ్ళకు ఒక విషయం అర్ధమయి వుంటుంది.గత ఖ్యాతి గాలిలో కలసిన ధూళి.ఇకపయిన అంతా,ఆడితే నోటు,అడకుంటె వేటు.ఇదే కార్పొరేటు క్రికెట్టు.
సచిన్ రంగంలో దూకుతున్నాడు.కనీసం అతడయినా పరువు నిలిపుకుంటాడని ఆశిద్దాం!     

గ్రేఎ మధ్య మన బ్లాగు ప్రపంచంలో గ్రంథాలయాలతో తమకున్న అనుభవాలను పంచుకోవటం చూస్తూన్నాం.నాకూ గ్రంథాలయాలతో నా అనుభవాలను పది మందితో పంచుకోవాలన్న ఆలోచన వచ్చింది.ఆ అలోచన కార్య రూపం దాల్చేందుకు ఇంత కాలం పట్టింది.అసలు లేక పోవటం కన్నా ఆలస్యమే మిన్న అనుకుని శ్రీకారం చుట్టాను.చుట్టచుట్టుకుని మెదడులో ఓ మూల దాగిన అనుభవాల చిట్టా విప్పుతున్నాను.
మ అమ్మ విపరీతంగా పుస్తకాలు చదివేది.ఆ కాలంలో వచ్చే తెలుగు,తమిళ పత్రికలన్నీ ఇంటికి వచ్చేవి.అమ్మ వంట చేస్తూ,అన్నం తింటూ ఇలా ఏమాత్రం అవకాశం దొరికినా పుస్తకాలు చదివేది.దాంతో,చదువరాకున్నా పుస్తకాలు తిరగేయటం బొమ్మలను చూడటం అలవాటయింది.బడికి వెళ్ళకముందే అమ్మ అక్షరాలు నేర్పింది.చందమామలు మా ముందు పడేసేది,అమ్మ చదువుతూంటే మేము తనని డిస్టర్బ్ చేయకుండా. 

బడిలో చేరినప్పుడు చందమామల పఠనం ఇతరులపయిన నాకు ఆధిక్యాన్నిచ్చేది.ఆ కథలు వారికి చెప్పటం ద్వారా నేను తరగతిలో ప్రత్యేకతను సాధించాను.చిన్న కథకు బోలెడంత స్వంత పైత్యాన్ని జోడించి వారాల తరబడి కొనసాగించి,వూరిస్తూ,కోపం వచ్చిన వాడిని కథ వినటం నుంచి బహిష్కరిస్తూ అధికారాన్ని కొనసగించేవాడిని.
పుస్తకాలు చదివేందుకు మరో అంశంకూదా ప్రోత్సాహాన్నిచ్చింది. మా ఇంట్లో పుస్తకాలు చదువుతూన్న వాడికి పనులు చెప్పేవారు కారు.వాడి మానాన వాడిని వదిలేసేవారు.దాంతో,చిన్న వాడినయినందున అందరూ చెప్పే చిన్న చిన్న పనులనుంచి తప్పించుకోవటానికి ఓ పుస్తకం ముందేసుకునేవాడిని.ముందు ఉంది కాబట్టి చదివేవాడిని.ఆసక్తి కరంగా వుంది  కాబట్టి కొనసాగించేవాడిని.అనీ మరచి చదివేవాడిని.దాంతో ఇంట్లో ఇప్పటికీ నేను “మెహమాన్”(అతిథి) గానే కొనసాగుతున్నాను.తరగతిలో కూడా ఎవరితో మాట్లాడక,ఆటలాడక పుస్తకాలు చదివేవాడిని.ఆ అలవాటువల్ల ఇప్పటికీ నాకు మితృలు లేరు.ఎవరితోనయినా మాట్లాడుతూంటే సమయం వ్యర్ధం చేస్తున్న భావన పీడిస్తుంది.మనసు పుస్తకం వైపు పరుగులు తీస్తుంది.
అందుకే,కాస్త వొంటరిగా బయటకు వెళ్ళే వయసు రాగానే అందరూ ఆటలకు పరుగులుతీస్తే నేను ఇంటి దగ్గరలో కొండపయిన వున్న గ్రంథాలయం వైపు పరుగులు పెట్టేవాడిని.మెట్టుగూడా గ్రంథాలయం చిన్నప్పటి నా దేవాలయం.దాని పక్కనే ఆంజనేయస్వామి గుడి వుండేది.లైబ్రరీ 4గంటలకు తెరిచేవాడు.స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళి సంచీ పడేసి,కొన్ని పాఠ్యపుస్తకాలు తీసుకుని గుడిలో కూచుని లైబ్రరీ తెరిచే వరకూ చదివేవాడిని.లైబ్రరీ తెరవగానే  లోపల దూరేవాడిని.కనబడ్డ ప్రతి పుస్తకం చదివేవాడిని.అనువాదాలు,చరిత్ర నవలలు,రష్యన్ నవలలు,ప్రేమ కథలు,సాహస కథలు అన్నీ చదివేవాడిని.ఒక సారి లైబ్రేరియన్ కు నేను ఉట్టిగా అన్ని పుస్తకాలు తీస్తున్నానని అనుమానం వచ్చింది.నేను చదువుతున్న పుస్తకం గురించి ప్రశ్నలు అడిగాడు.ఆ తరువాత అతనే నాకు మంచి పుస్తకాలు ఇచ్చేవాడు.శరత్ సాహిత్యాన్ని నాకు పరిచయం చేసింది అతనే.ఎండాకాలం సెలవుల్లో,పొద్దున్నే లైబ్రరీకి వెళ్ళేవాడిని.11గంటలకు లైబ్రరీ మూయగానే,గుడిలో కూచుని అమ్మకు తెలియకుండా తెచ్చిన అమ్మ చదివే నవలలు చదివేవాడిని.మళ్ళీ 4గంటలకు లైబ్రరీ తెరవగానే లైబ్రరీలో దూరేవడిని.లైబ్రరీ మూసేయగానే ఇల్లు చేరేవాడిని.ఇలా నేను 10 తరగతి పాసయేసరికి,ఆ లైబ్రరీ పని అయిపోయింది.విశ్వనాథ వారి సాహిత్యం వేయిపడగలతో సహా చదివేశాను.నా ఆసక్తి గమనించి మా తెలుగు టీచెర్ పుస్తకాలిచ్చేవాడు.పాఠ్యపుస్తకాలు ముందే చదువుకుని సంవత్సరమంతా నవలలు చదివుతూ వేరే ప్రపంచంలో తేలుతూండేవాడిని.
పదవతరగతి పరీక్షలు రాసిన తరువాత సెలవుల్లో అన్నయ్య నాకు రెండు గొప్ప విశయాలు పరిచయం చేశాడు.పాత హిందీ సినిమాలు,సికందరాబాద్ లోని గాస్మండీ లైబ్రరీ.మెట్టుగూడా కన్నా పెద్ద గ్రంథాలయం ఇది.
ఇంకేం,నాకు కంటినిండా పని.
ఇంటర్లో ఇంగ్లీష్ మీడియంలో చేరాను.దాంతో తెలుగు నవలలు తగ్గించి ఇంగ్లీష్ నవలలపయిన పడ్డాను.జేంస్ హాడ్లీ చేస్ నా మొదటి గురువు.అయితే ఈ నవలలు గ్రంథాలయాలలో వుండేవి కావు.వాటిని ప్రైవేట్ లైబ్రరీల్లోంచి అద్దెకు తెచ్చుకోవాల్సి వచ్చేది.అందుకు డబ్బులు వుండేవి కావు.దాంతో,డబ్బులున్న మితృలను కాకా పట్టి,కథలు చెప్పి వాళ్ళదగారనుంచి నవలలు తీసుకుని ఒక్క రాత్రిలో చదివి తెల్లారేసరికి ఇచ్చేసేవాడిని.నేను చదివానని వాళ్ళు నమ్మేవారుకారు.చదివినట్టు నిరూపిస్తే మళ్ళీ ఇచ్చేవారు కారు.అందుకని చదివినా అర్ధంకానట్టు నటించి,పోసులు కొడుతున్నట్టు నమ్మించి పుస్తకాలు సంపాదించేవాడిని.చదివేసేవాడిని.
ఇంటెర్ చివర్లో నాకు అశోక్ నగర్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ పరిచయమయింది.అదో అద్భుత ప్రపంచం.రిఫరెన్స్ సెక్షన్ లోని పుస్తకాలు,ప్రిసెర్వేషన్ సెక్షన్ లోని పాత రీడెర్స్ డిజెస్ట్,టైం,ఇతర సైన్స్ పత్రికలు నావే.ఇప్పటికీ ప్రిసెర్వేషన్ సెక్షన్ లో  సెక్షన్లలొ ఒకోసారి నేను ఒక్కడినే గంటల తరబడి వుంటాను.నాకు వుద్యోగం రాగానే నేను చేసిన మొదటి పనుల్లో రీడెర్స్ డిజెస్ట్ కు,లైబ్రరీకి సభ్యత్వాలు కట్టటం వున్నాయి.
డిగ్రీలో వున్నప్పుడు నాకు ఇచ్చే పాకెట్ మనీతో లోక్లాసులో సినిమాలు చూడటం ఒక పని.సికిందరాబాద్ స్టేషన్ దగ్గర ఎస్,బి,ఎస్ అని ఒక అద్దె లైబ్రరీ వుంది.రోజుకింత అని డబ్బులు తీసుకుని పుస్తకాలు అద్దెకిచ్చేవాడు.ఒక మితృడు ఇచ్చిన ఇర్వింగ్ వాలాస్ నవల సెకండ్ లేడీ అన్ని తప్పుడు కారణాలకు నన్ను వాలేస్ వైపు ఆకర్షించింది.దాంతో ఆ లైబ్రరీలో వాలాస్ పుస్తకాలు తీసుకుని ఒక్క రాత్రిలో చదివి ఇచ్చేవాడిని.లేకపోతే అద్దె పెరుగుతుంది.అద్దెపెరిగితే చదివేందుకు మరో పుస్తకం తగ్గుతుంది.ఇలా ఒక్క రాత్రిలో చదవాల్సి రావటం వల్ల వేగంగా చదవటం అలవాటయింది.ఇప్పటికీ నా వేగం చూసి చాలా మంది నేను నటిస్తున్నాననుకుంటారు.కానీ రూపాయి విలువ ,సమయం విలువ తెలిసిన వాడిని.రెండూ వ్యర్ధం చేయను.వాలెస్ పయిన అభిప్రాయం మరటమే కాదు అతని వల్ల డి హెచ్ లారెన్స్ పరిచయం అయ్యాడు.అలా ఇంగ్లీష్ క్లాసిక్స్,కమర్షియల్సు రెండూ చదివాను.
బ్రిటీష్ లైబ్రరీలో బోలెడన్ని పుస్తకాలుంటయని ఒక మితృడు చూపించాడు.కానీ ఫీసు ఎక్కువ.లైబ్రరీ మీదుగా బస్సులోంచి వెళ్తూ ఆశగా లైబ్రరీ వైపు చూస్తూండేవాడిని.వుద్యోగం రాగానే ధైర్యం చిక్క బట్టుకుని వీలు దొరకగానే మెంబరయ్యాను.ఇప్పటికీ మెంబర్నే!
యూనివర్సిటీ లైబ్రరీ,అఫ్జల్ గంజ్ లోని పెద్ద లైబ్రరీలు నా అడ్డాలు.ఇప్పటికీ నగరంలోని అన్ని ప్రధాన గ్రంథాలయాలతో పాటు ఇంటి దగ్గరి ఆర్ఖేడ్ అద్దె లైబ్రరీలో కూడా సభ్యత్వం వుంది.
వుద్యగంలో స్థిర పడిన తరువాత అంతకాలం చదివి మళ్ళీ మళ్ళీ చదవాలనిపించిన పుస్తకాలను కొనటం ఆరంభించాను. నెమ్మదిగా ఇంట్లోనే ఒక లైబ్రరీ తయారయింది.ఇల్లు మారినప్పుడల్లా అసలు సామాన్లకొక లారీ అవసరమయితే పుస్తకాలకు రెండు లారీలవసరమయ్యేది.విసిగి స్వంత ఇల్లు కట్టాను.అయితే,బెడ్రూము లైబ్రరీలా వుందని కనీసం అక్కడయినా తన సవతి నుంచి విముక్తి కావాలని అర్ధాంగి కోరటంతో ఇంటికి మరో అంతస్తు జోడించి పుస్తకాలతో పాటూ నేనూ అక్కడికి చేరుకున్నాను.
లైబ్రరీలు ముఖ్యంగా గ్రంథాలయ సంస్థలు డబ్బుతో పని లేకుండా పుస్తకాలు చదివే వీలు కల్పించటం వల్ల ఎందరి పఠనాసక్తికో సంతృప్తి ఇస్తున్నాయి.ఇప్పటికీ రివ్యూ పుస్తకాలెన్ని వస్తున్నా, నేనెన్ని పుస్తకాలు కొంటున్నా లైబ్రరీ  ప్రత్యేకత దానిదే.లైబ్రరీలో వెళ్ళి కూర్చుంటే అదో వింత అనుభూతి,ఆనందం కలుగుతాయి.ఇప్పటికీ లైబ్రరీలలొ చర్లెస్ డికెన్స్ నవలలు,విశ్వనాథ నవలలు చూస్తే ఆ కాలంలో లాగా ఆత్రంగా తీసుకుంటాను.ఈ పుస్తకాలన్నీ ఇంట్లో వున్నాయని గుర్తుకొచ్చి నవ్వుకుంటాను.నాకు ఒకోసారి ఒక కోరిక బలంగా కలుగుతూంటుంది.లైబ్రరీలో పుస్తకం చదువుతూ చనిపోవటం కన్నా ఆనందకరమయిన చావు లేదనిపిస్తుంది.అలా అన్నప్పుడు కోపం వచ్చిన నా వాళ్ళూ ” ఆ చావేదో ఇంట్లోనే పుస్తకం చదువుతూ పోవచ్చుగా”అంటారు.అయితే,అమ్మ,నా భార్య లతో పాటూ ఈ ప్రపంచంలో నాకు ఆప్తులెవరయినా వుంటే అవి గ్రంథాలయాలే.ఎవరయినా తన ఆప్తుల నడుమ ఆనందంగా కన్ను మూయాలనుకుంటారు.నేనూ అందుకు భిన్నం కాదు.

 

ఇటీవలే ఒక బ్లాగులోని చర్చకు-రచయితగా,విమర్శకుడిగా,పాఠకుడిగా నా స్పందన ఇది.
ఎలాగయితే రచనలు చేసే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికీ వుందో,అలాగే విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ వుంది.రచయిత ఒకానొక భావావేశంలో రచన చేస్తాడు.పాఠకుడు రచన ద్వారా రచయిత భావావేశంతో స్పందిస్తాడు.ఒకవేళ రచయిత తో పాఠకుడు స్పందించలేకపోతే,ఆ రచనను పాఠకుడు మెచ్చలేడు.ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే,రచయిత తనకు నచ్చింది రాయాలా?పాఠకుడు మెచ్చేది రాయాలా?
తనకు నచ్చింది రాయాటంలో రచయిత తన అంతరంగాన్ని ప్రదర్శిస్తాడు.ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాడు.సంతృప్తి పొందుతాడు.కానీ,ఈ సంతృప్తి అత్యంత తీవ్ర మయిన ఆనందంగా,ఇతరుల మెప్పుతోనే మారుతుంది.కళాకారుడు ఎంత తనకోసమే కళను సృజించినా పదిమంది మెప్పు పొందినప్పుడే దానికి సార్ధకత లభిస్తుంది. నేను అద్భుతమయిన కథ రాసి అటక మీద దాచుకోవటం అర్ధరహితం.
అయితే,రచయిత తన స్థాయిలో కథ రాస్తే దాన్ని పాఠకుడు అందుకోలేకపోతే ఆ రచన వ్యర్ధమే అవుతుందికదా అన్న సందేహం  జనిస్తుంది.
కానీ,ఈ రచనా ప్రతి వ్యక్తినీ మెప్పించలేదు.ఇది నిజం.ఒకరి కంట నీరు పొంగించిన కథ మరొకరికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు.ఇంకొకరికి విసుగు కలిగించవచ్చు.అటువంటప్పుడు అందరినీ మెప్పించాలని ప్రయత్నించి తన వ్యక్తిత్వాన్ని కోల్పోవాలా?ఎవరు మెప్పుతో సంబధంలేదని తనకు నచ్చినట్టు రాస్తూపోవాలా?నా మటుకు నాకు వందమందిని మెప్పించాలని స్వీయాత్మను కోల్పోవటం కన్నా,రచయిత కనీసం తన ఒక్కడి మనసుకు ఆనందం కలిగించే రచనలు చేస్తూ పోవటమే వుత్తమం అనిపిస్తుంది.ఎందుకంటే అందరినీ మెప్పించటం అసాధ్యం.ఆ తపనలో ఎవరిమెప్పు పొందలేడు.కాబట్టి కనీసం తనకయినా సంతృప్తి కలిగే రీతిలో రచనలు చేయటం మంచిది.వాళ్ళకు నచ్చదేమో,వీళ్ళకు కోపం వస్తుందేమో,ఇంకొకరికి అర్ధం కాదేమో అన్న భయాలతో చేసే రచనలు రచయితను విదూషకుడినో భట్రాజునో చేస్తాయి.మన తెలుగు సాహిత్య ప్రపంచ ప్రస్తుత పరిస్థితి ఇది.అందరికీ అర్ధమయ్యే రచనలు చేయాలన్న పట్టుదలలో,భాష దెబ్బతిన్నది.భావం పాతాళంలో పడింది.సాహిత్యం హాస్యాస్పదమయింది.రచయిత చులకన అయ్యాడు.ఇంత చేసీ పాఠకులు విముఖత చెంది సమకాలీన సాహిత్యాన్ని చదవటం మానేశారు.
ఒక స్థాయిలో వున్న వాడిని పైనుండి కిందకులాగటం కన్నా కిందవారు పై స్థాయికి ఎదిగాలన్న ఆలోచనను పట్టుదలనూ ప్రదర్శిస్తే మంచిది.
అందరికీ అర్ధమయ్యేట్టు రాయాలని ఒక రచయిత తపన పడ్డాడు.ఒక కథ రాసి నలుగురికి వినిపించాడు.దాన్లో అన్నం అన్న పదం రాగానే ఒకడు అభ్యంతరం చెప్పాడు.బువ్వ అంటే నాకు అర్ధమవుతుంది ఆ పదం వాడాలి అన్నాడు.వెంటనె మరొకడు కూడు అంటే నాకు తెలుస్తుంది అన్నాడు.మరొకడు భోజనం అనరాదా బాగుంటుంది అన్నాడు.రచయిత గతి వేరే చెప్పనవసరం లేదుగా?
అందుకే రచయిత రచన చేసేటప్పుడు ఇతరాలను విస్మరించాలి.తాను చెప్పదలచుకున్నది సరిగా చెప్తున్నాదా,తనకు సంతృప్తి కలుగుతోందా అన్నదే దృష్టిలో వుంచుకోవాలి.
ఒక్క సారి రచన పదిమందిలోకి వెళ్ళిన తరువాత ఇక దానిపయిన భిన్నాభిప్రాయాలు వస్తాయి.
వినదగునెవ్వరు చెప్పిన.ఒక వ్యక్తి ఒక వ్యాఖ్య చేయటం వెనుక అనేక అంశాలుంటాయి.అదీగాక తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంది.దాన్ని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు.పత్రికలలో ఎడిటర్లు అడ్డుపడతారు.బ్లాగుల్లో ఎవరికీ ఆ హక్కు లేదు.ఎదుటి వారి అభిప్రాయాన్ని మన్నించాలి.వీలయితే వారికి వివరించాలి.వారికి రచనను ఏ రకంగా చూడవచ్చో చెప్పాలి.అంతేకానీ,వ్యక్తిగత్ విమర్శలు,హేళణలు అనవసరం.సాధారణంగా రచయితకన్న అతని అభిమానులే ఇటువంటి విశయాల్లో తీవ్రంగా స్పందిస్తారు.అయితే,విమర్శలో కూడా విమర్శకుడి హృదయం ప్రాధాన్యం వహిస్తుంది.కొందరు కావాలని విమర్శిస్తారు.దానికి స్పందించాల్సిన పనిలేదు.కొందరు నిజాయితేగా సందేహిస్తారు.వారికి అంతే నిజాయితేగా వివరణ ఇచ్చుకోవాల్సివుంటుంది.రంధ్రాన్వేశి కుండలో ఎన్ని నీళ్ళు పోసినా వ్యర్ధమే.జిఙ్నాసికి నీటి చుక్క కూడా అమృతమే!
ఒక పత్రికలో ఒక సమీక్షకుడున్నాడు.ఆయనకు నేను వ్యక్తిగతంగా నచ్చలేదు.దాంతో నేను ఏమి రాసినా దాన్ని దూశించటం,తీసిపారేయటమే లక్ష్యంగా ప్రవర్తిస్తాడు.దానికి విలువనిస్తే అనవసరంగా అతడికి విలువనిచ్చినట్టవుతుంది.
ఇందుకు భిన్నంగా కొందరు పాఠకులు ఇలా ఎందుకు రాసారు,ఇలా రాయవలసింది అని నిజయితీగా అడుగుతారు.వారికి వీలయితే వివరించటం,లేక్పోతే ఈ సారి అలా రాస్తానని సంతృప్తి పరచటం చేయాలి.ఇలాంటి వారు నిజమయిన పాఠకులు.వారెంతో సున్నిత స్వభావులు.వారిని నొప్పించటం అంటే అసలు పాఠకుడిని దూరం చేసుకోవటమే.
గమనిస్తే,రచయితలూ,పాఠకులూ,విమర్శకులూ అందరూ విద్యావంతులే.ఒకరి నొకరు గౌరవించుకుంటూ అర్ధం చేసుకుంతూ విచక్షణతో ముందుకు సాగితే అందరికీ ఆనందం.సాహిత్యం అభివృద్ధిచెందుతుంది.సమాజం ముందడుగు వేస్తుంది.
అందరూ అంగీకరించాల్సిన విషయం ఒకటుంది.అమృతం కావాలంటే సాగర మథనం తప్పనిసరి.సాగర మథనంలో హాలాహలం వస్తుంది.ఇవన్ని భరిస్తేనే అమ్ర్తాన్ని స్వీకరించే అర్హత వస్తుంది.రచయితకు,పాఠకుడికీ,విమర్శకుడికీ,అందరికీ, ఇది వర్తిస్తుంది.  

Next Page »